ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా రద్దు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. రాష్ట్రం లో గల వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తున్న 15 శాతం స్థానికేతర (నాన్ లోకల్), జనరల్ కోటా సీట్ల విషయం పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రం లో అమలు చేస్తున్న నాన్ లోకల్ కోటా ను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే కేటాయిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
🔥 విద్యా సంస్థల్లో నాన్ లోకల్ కోటా రద్దు :
ఉన్నత విద్యా సంస్థలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తున్న 15 శాతం నాన్ లోకల్ కోటా ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మాత్రమే వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
🔥 నేపధ్యం :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా 2014 లో ఏర్పాటు కావడం తో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 లో ప్రస్తావించిన విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణ విద్యా సంస్థలలో నాన్ లోకల్ కేటగిరి లో 15 శాతం, తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలలో 15 శాతం సీట్లు కేటాయింపు జరిపేవారు.
అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కావడం తో వృత్తి విద్య, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులలో ప్రవేశాలు మరియు ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో తెలంగాణ విద్యార్థులకు కేటాయించిన 15 శాతం నాన్ లోకల్ కేటగిరి ను తొలగించి, ఆ 15 శాతం కూడా ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకే కేటాయించారు.
ఇప్పటికే తెలంగాణ లో గల విద్యా సంస్థలలో, యూనివర్సిటీ లలో ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు గల 15 శాతం కోటా ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
2014 జూన్ 02 కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 రీజినల్ లుగా స్థానికత నిర్ధారించారు.అవి ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ లను పరిగణ లోకి తీసుకొనే వారు.
🔥 ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం స్థానికత నిర్ధారణ ఏ విధంగా ఉంటుంది ? :
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రెండు రీజియన్లు ఆధారంగా స్థానికత నిర్ధారిస్తారు. అవి
1) ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్
2) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్
ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్ :
13 జిల్లాల ప్రాధిపతికన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఆంధ్రా రీజియన్ లో భాగంగా ఉంటాయి.
పైన పేర్కొన్న జిల్లాలలో గల విద్యా సంస్థలలో చదివే విద్యార్థులను ఆంధ్రా రీజియన్ లోకల్ / స్థానికులు గా గుర్తిస్తారు.
శ్రీ వెంకటేశ్వర రీజియన్ :
13 జిల్లాల ప్రాధిపతికన ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు శ్రీ వెంకటేశ్వర రీజియన్ లో భాగంగా ఉంటాయి.
పైన పేర్కొన్న జిల్లాలలో గల విద్యా సంస్థలలో చదివే విద్యార్థులను శ్రీ వెంకటేశ్వర రీజియన్ లోకల్ / స్థానికులు గా గుర్తిస్తారు.
🔥 ప్రస్తుతం స్థానికేతరులు ఎవరు అవుతారు ? :
- పైన పేర్కొన్న విధంగా ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ లో గల విద్యార్థులు మరియు అభ్యర్థులు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ లో గల 15 శాతం సీట్లకు నాన్ లోకల్ కేటగిరి క్రింద దరఖాస్తు చేసుకోవచ్చు మరియు పోటీ పడవచ్చు.
- అలానే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ లో గల విద్యార్థులు మరియు అభ్యర్థులు ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్ లో గల 15 శాతం సీట్లకు నాన్ లోకల్ కేటగిరి క్రింద దరఖాస్తు చేసుకోవచ్చు మరియు పోటీ పడవచ్చు.
- ఉద్యోగ, ఉపాధి అంశాలు తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలలో ఉన్నట్లు అయితే, తల్లిదండ్రులలో ఎవరో ఒకరు గతంలో ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ లో నివసించి ఉన్నట్లు అయితే, వారు పిల్లలు నాన్ లోకల్ కేటగిరి క్రింద పోటీ చేసేందుకు గాను అర్హత కలిగి ఉంటారు.